ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ జరుగుతున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె లో భాగంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణం లో బ్యాంక్ సెంటర్ నుండి ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ గా బయలుదేరి బంగ్లా సెంటర్ వరకూ సాగి తిరిగి మరలా బ్యాంకు సెంటర్ లో ముగించారు.
ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు అనిల్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులు వలనే దేశం ఆర్థికంగా నిలదొక్కుకున్నదని అన్నారు. బ్యాంకులు ప్రైవేటీకరణ జరిగితే ప్రజల పొదుపు కు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. ఖాతాదారులు ఈ పోరాటానికి మద్దతుగా నిలవాలన్నారు.
రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ అని ఒకవైపు చెపుతూ మరో వైపున మొత్తం ప్రభుత్వ రంగాన్ని చాపచుట్టి కార్పొరేట్ లకు అప్పజెప్పేందుకు ప్రయత్నించటంవల్ల దేశ స్వావలంబన ప్రమాదం లో పడుతుందన్నారు.
ఈ ఆరేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 9లక్షలకోట్లు లాభాలను ఆర్జించాయని ఈ సమయంలోనే దాదాపు 18.63 లక్షల కోట్ల కార్పొరేట్ సంస్థల రుణాలు మాఫీ చేయడం వల్ల ప్రభుత్వ బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం బ్యాంకు ల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగులు సంఘ నాయకులు నవీన్ సైదా రమేష్ చంద్ర సలీం సీతారామయ్య నూర్ బాషా సిఐటియ మండల కార్యదర్శి తెలగపల్ల శ్రీనివాస్ బత్తుల వెంకటేశ్వర్లు కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.