ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఇలవేల్పు పైడితల్లమ్మ వారి ఆలయ అభివృద్ధి పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి వెల్లడించారు. అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా అలరారుతున్న పైడితల్లమ్మ ఆలయ విస్తరణకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. దీంతో ప్రభుత్వం అప్పట్లో ప్రకటించిన పరిహారం కన్నా ప్రస్తుతం ఉన్న రేట్లు ప్రకారం పరిహారాన్ని రాబట్టి వారికి అందజేయడం జరిగిందన్నారు.
మంగళవారం ఖాదీ వస్త్రాలయం వారికి నష్టపరిహారం కింద చెక్కును అందించామన్నారు. త్వరలోనే మంత్రి బొత్స సత్యనారాయణ సూచనలతో అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో పైడితలమ్మ జాతరకు భక్తులను అనుమతించలేదని గుర్తు చేశారు. ఈసారి పండగకు భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుందన్న ఉద్దేశంతో విఐపి పాసులను కూడా రద్దు చేశామన్నారు.
సామాన్య ప్రజలకు అమ్మవారి దర్శనం సౌలభ్యంగా ఉండాలన్న రీతిలో చేసిన ఏర్పాట్లకు భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. అయితే మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పైడితలమ్మ జాతరలో గేటుకు తాళం వేశారన్న విషయమై పదేపదే తన పై విమర్శలు గుప్పిస్తున్నారని, ఇది ఆయనకు తగదని అన్నారు. వాస్తవంగా జాతర నాడు విఐపి పాసులు రద్దు చేసినప్పటికీ వీఐపీ గేటులో మిగిలిన లైన్లు కన్నా ఎక్కువ మంది ప్రజలు ఉండడం గమనించి బాధ్యతగల వ్యక్తిగా విఐపి గేటుకు తాళం వేశానని, ఇది తప్పా అని ప్రశ్నించారు. దీని ఫలితంగానే సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం భాగ్యం సులభతరంగా లభించిందన్నారు. తమ నేతలకు, కార్యకర్తలకు విఐపి గేటు ద్వారా దర్శనం జరగలేదన్న ఆకస్సుతో తనపై పదే పదే విమర్శలు చేస్తున్నారని అన్నారు. వాస్తవాన్ని ఇప్పటికైనా గ్రహించాలని, లేనిపోని అవాస్తవాలను మాట్లాడవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కిషోర్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు అచ్చిరెడ్డి, పతివాడ వెంకట్రావు, వేత్స శ్రీనివాసరావు, చిల్ల పుష్ప, గంధం లావణ్య, బలివాడ పార్వతి, రామ్ సింగ్ సూరమ్మ, పార్టీ నాయకులు బలివాడ కాశి, గంధం హరిబాబు, చిట్టెల రాంబాబు , ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు