విజయవాడ నగర పోలీసు కమిషనరుగా 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బత్తిన శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీపీగా వ్యవహరించిన సీహెచ్ ద్వారకాతిరుమలరావు రైల్వే పోలీస్ డైరక్టర్ జనరల్ గా బదిలీ అయ్యారు.
సీపీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బి.శ్రీనివాసులు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా నగరంలో అదనపు సీపీగా పనిచేస్తున్నానని, ఇక్కడ గతంలో 15 నెలలు సీపీగా, అంతకుముందు పశ్చిమ జోన్ ఏసీపీగా పనిచేసిన అనుభవం ఉందని అన్నారు.
పోలీసులు ప్రజలకు మరింత చేరువవ్వాలని, త్వరితగతిన న్యాయం జరిగేలా, మరింత బాధ్యతాయుతంగా సేవలందించేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ ను పటిష్టం చేసి శాంతిభద్రతలను పరిరక్షిస్తామని తెలిపారు. బేసిక్ పోలీసింగ్ ను మెరుగుపరచడమే తన ప్రధమ ప్రాధాన్యతగా బత్తిన చెప్పారు.
కమిషనరేట్ పరిధిలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అవగాహన కలిగివుండాలని, సైబర్ సెల్ అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలు మోసగాళ్ల బారినపడకుండా పనిచేస్తోందని అన్నారు.
బత్తిన శ్రీనివాసులుకు సీపీగా బాధ్యతలు అందించిన సందర్భంగా ద్వారకాతిరుమలరావు మాట్లాడుతూ నగరంలో 23 నెలల పాటు పనిచేశానని, సాధారణ ఎన్నికల నిర్వహణ, స్థానిక ఎన్నికల ప్రక్రియ, కోవిడ్ 19 విపత్తులలో సమర్ధవంతంగా పనిచేసామని అన్నారు. పలు అంశాలలో ప్రయోగాత్మకంగా పనిచేసామని, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సంబంధాల నిర్వహణలలో మెరుగైన ఫలితాలు సాధించామని వెల్లడించారు.