మన సంస్కృతి సంప్రదాయాలను నిలుపుకోవాల్సిన అవసరం తో పాటు మన ఆచార వ్యవహారాలను కొనసాగించాల్సిన అవసరం తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతీ ఒక్కరి పై ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆస్టేలియా రాజధాని మెల్ బోర్న్ నగరం లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆన్ లైన్ లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జూమ్ యాప్ ద్వారా వేడుకలను వీక్షించిన మంత్రి మాట్లాడుతూ ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ గత ఏడు సంవత్సరాలు గా చేస్తున్న సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా మంచి పద్ధతుల్లో కొనసాగుతున్నాయని కొనియాడారు.
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రవాస భారతీయులు మన దేశ, ప్రాంత పునాది ని మర్చిపోకుండా మన సంస్కృతి , సంప్రదాయాలను కొనసాగించాలని మంత్రి తెలిపారు.
మన సాంస్కృతిక వారసత్వ పండుగ అయిన బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియా లో నిర్వహించిన ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధి అనీల్ తో పాటు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
లక్షలాది మంది ఒక చోట చేరి చేసుకునే సామూహిక ఉత్సవాలైన బతుకమ్మ, దసరా పండగలను ఈసారి ప్రజలు వదిలేసిన పద్ధతుల్లో కాకుండా , ఎవరి ఇళ్లలో వారే చేసుకోవాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.
తనను బతుకమ్మ వేడుక కు ఆహ్వానించిన ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి, వీలు అయితే ఆస్ట్రేలియా వచ్చి అసోసియేషన్ ప్రతినిధులను స్వయంగా కలుస్తానన్నారు.