తెలంగాణ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవం పెరిగే విధంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఆత్మగౌరవ భవనాలు తమకు కూడా కావాలి పలు బీసీ సంఘాల నేతలు కోరారు. బుధవారం మంత్రి గంగుల కమలాకర్ ను మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసంలో కలిసి ఈ మేరకు వినతి పత్రాలు సమర్పించారు.
లోద్ క్షత్రియ సదర్ పంచాయత్ ప్రతినిధులతో పాటు, తెలంగాణ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. తెలంగాణలో బీసీ ఏలో ఉన్న అగ్నికుల క్షత్రియులు జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్నారని తమకూ ఆత్మగౌరవ భవనాన్ని కేటాయించాలని కోరారు. లోద్ కులస్థులు తమకు ఉప్పల్ బగాయత్ లో కేటాయించిన 20 గుంటలకు అదనంగా భూమితో పాటు నిధుల్ని కేటాయించాలని కోరారు.
వీరి వినతుల్ని సానుకూలంగా విన్న మంత్రి గంగుల, వారి వినతులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయబద్దమైన కోరికలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో లోద్ క్షత్రీయ సదర పంచాయత్ ప్రతినిధులు హరిద్వార్ సింగ్, భగీరథ్ సింగ్, తెలంగాణ అగ్నికుల క్షత్రీయ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు టి వెంకటేశ్వర్ రావు, చిప్పాల రామక్రుష్ణ తదితరులు పాల్గొన్నారు.