కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం బిసి కుల జనగణన చేయకుండా మొండివైఖరి అవలంబిస్తుందని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల లోని బిసి కాలనీలోని వడియరాజుల కమ్యూనిటీ హాలులో ఆదివారం నాడు బిసి సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం, ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి బిసి సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు మాట్లాడుతూ దేశ జనాభాలో సుమారు 60 శాతం పైగా బిసిలు ఉన్నారని అన్నారు. బిసిలకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం వహించేందుకు సీట్లు కేటాయించటంలో అన్ని రాజకీయ పార్టీలు వైఫల్యం చెందాయని ఆరోపించారు.
బిసి కులజనగణన చేయాలని ఉద్యమం చేపట్టామని అన్నారు. దేశవ్యాపితంగా జరుగుతున్న ఈ ఉద్యమానికి 18 రాజకీయపార్టీలు మద్దతు తెలిపాయని అన్నారు. 8 రాష్ట్రాలలో అసెంబ్లీలలో తీర్మానం చేసి కేంద్రానికి పంపటం జరిగిందని అన్నారు.
అయితే బిజెపి ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నదని ఆయన అన్నారు. ఈ నెల 3 నుండి ఏప్రిల్ 13న జరిగే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజు వరకు బిసి కుల జనగణన కొరకు ఉద్యమాలు చేస్తామని అన్నారు. బిసి జనగణన పై నిర్లక్ష్యం వహిస్తే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. బిసి సంక్షేమ సంఘాన్ని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీలకతీతంగా పనిచేసే ఈ సంఘాన్ని బిసిలు ఆదరించాలని కోరారు. బిసి సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ మాట్లాడుతూ బిసిలు రాజకీయ జెండాలు కాకుండా బిసి జెండాను మోయాలని అన్నారు. గ్రామాలలో బిసిలు అన్ని రంగాల్లో ఎదగనీయకుండా అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.
బిసిల ఎదుగుదలకు బిసి సంక్షేమ సంఘం కృషి చేస్తుందని అన్నారు. బిసి కుల జనగణన కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలుచేసి బిసిలకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో అవకాశము కల్పించాలని డిమాండ్ చేశారు. మండలాలలో నూతనంగా ఏర్పడుతున్న కమిటీలు బిసిల సమస్యలకొరకు పనిచేయాలని సూచించారు.
అనంతరం బిసి సంక్షేమ సంఘం మండల నూతన అధ్యక్షుడిగా గాలి సాంబశివరావు, బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షుడుగా మండల మాజీ అధ్యక్షుడు సరికొండ తిమ్మరాజు ప్రమాణస్వీకారం చేశారు. వారిని రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఘనంగా సన్మానించి నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేసన శంకర్రావును నాయకులను ఘనంగా సన్మానించారు. అనంతరం స్థానిక చెరువుకట్ట సెంటర్లో బిసి సంక్షేమ సంఘం మండల కార్యాలయమును రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ప్రారంభించారు. తొలుత స్థానిక హైవే రోడ్డునుండి బిసి కాలనీ వరకు భారీ ర్యాలీ జరిగింది.
ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పరిసా రంగనాధ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యామ మురళీ, బిసి సంక్షేమ సంఘం సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పన వెంకటేశ్వర్లు, నరసరావుపేట మండల అధ్యక్షుడు నాగారపు గురుఆంజనేయులు, నరసరావుపేట పట్టణ అధ్యక్షుడు కొల్లిపర బాలాజీ మండల నాయకులు నిడమానూరు సాంబశివరావు , కోనేటి నరసింహారావు, ముక్కడాల వెంకటేశ్వరరావు, పేరేచర్ల కోటేశ్వరరావు, ఉప్పలపాటి వెంకటేశ్వర్లు, కల్లూరి ఆంజనేయులు, యుద్దనపూడి ఖాశింసైదులు తదితరులు పాల్గొన్నారు.