రాష్ట్ర బి.సి.కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎ.శంకర్ నారాయణ
వెనుకబడిన తరగతుల జాబితా లో చేర్చబడిన అన్ని కులాల ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తామని , అన్నిటిని సమీకరించిన మీదట కమిషన్ లో చర్చించి , కమిషన్ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుందని రాష్ట్ర బీ.సీ.కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎ.శంకర్ నారాయణ తెలిపారు. విజయనగరం జిల్లా కలక్టరేట్ ఆడిటోరియం లోబీ.సీ తరగతుల జాబితాలో చేర్చబడిన కులాల పౌరుల నుండి ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు కమిషన్ చైర్మన్, ముగ్గురు సభ్యులు కలసి బహిరంగ విచారణ జరపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వెనుకబడిన తరగతుల జాబితాలో నున్న కులాలు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ నుండి వారి గ్రూప్ ను మార్చమని, మరి కొన్ని కులాలు కుల ధృవీకరణ పత్రాల మంజూరు లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అనేక విజ్ఞాపనలు కమిషన్ వద్ద దాఖలయ్యాయన్నారు. ఈ బహిరంగ విచారణలో అన్ని కులాలు, వర్గాల వారు ఇచ్చిన వినతులను, చెప్పిన అంశాలను , వారి స్థితి గతుల్ని పరిశీలించి కమిషన్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి క్షున్నంగా చర్చించి కమిషన్ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి తగు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.
కమిషన్ సభ్యులు మారక్కగారి కృష్ణప్ప మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల్లో 139 కులాలు ఎ,బి,సి,డి,ఈ గా వర్గీకరించబడి ఉన్నాయని, అందరి స్థితి గతులను కమిషన్ అధ్యయనం చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం లో శాశ్వత బి,సి. కమిషన్ ఉన్నదని, బి.సి. సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.మరొక సభ్యులు దివాకర్ పక్కి మాట్లాడుతూ బి.సి. లుగా గుర్తించబడి కుల ధృవ పత్రాలు పొందలేని వారికీ న్యాయం జరిగేల చూస్తామన్నారు.
సభ్యులు ఎ.ముసలయ్య మాట్లాడుతూ బి.సి. లకు న్యాయం చేసేలా ప్రభుత్వం పని చేస్తోందని , అందుకే ఇంతవరకు లేని విధంగా శాశ్వత కమిషన్ ను నియమించిందని అన్నారు. మెంబెర్ కార్యదర్శి డి. చంద్ర శేఖర్ రాజు తొలుత కమిషన్ సభ్యులను పరిచయం చేసిన అనంతరం మాట్లాడుతూ గత పాతికేళ్లలో పుట్టుస్వామి, సుభ్రమణ్య స్వామి, మంజునాద్ అనే మూడు కమిషన్లు పని చేసాయని, ప్రస్తుత జస్టిస్ శంకర్ నారాయణ కమిషన్ నాల్గ వదని, ఇక పై శాశ్వత కమిషన్ గా బిసి కమిషన్ పని చేస్తుందని తెలిపారు.