రాష్ట్రంలో వివిధ జిల్లా పోలీసులు మూడు మాసాల్లో ఛేదించిన కేసుల దర్యాప్తును పరిశీలించి, వాటిలో ఉత్తమంగా దర్యాప్తు చేసిన కేసులకు ఇచ్చే ఎ.బి.సి.డి. (అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్) అవార్డులలో విజయనగరం జిల్లా పోలీసులకు మూడవ స్థానం లభించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు మంగళగిరి రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, విజయనగరం వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ లు అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్ అందుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ డిజిటల్ అరెస్టు కేసును చేదించుటలో విజయనగరం జిల్లా పోలీసులు చక్కని ప్రతిభ కనబర్చారన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు డిజిటల్ అరెస్టు మరియు ఇతర సైబరు నేరాలు గురించి అవగాహన కల్పించాలన్నారు. టెలిగ్రాం యాప్ ద్వారా ప్రజలను మభ్య పెడుతూ, ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారని, అటువంటి టెలిగ్రాం గ్రూపులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను రాష్ట్ర డిజిపి ఆదేశించారు.
కేసుల దర్యాప్తులో డిజిటల్ అరెస్టు అన్నది లేదని, ఎవరైనా ఈ తరహా నేరాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర డిజిపి హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు కమీషన్లకు ఆశ పడి టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా సైబర్ మోసాలకు పాల్పతున్నారని, వారిపై సాంకేతిక ఆధారంగా నిఘా పెట్టాలని, వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ మూడు నెలలకొకమారు వివిధ జిల్లా పోలీసులు చేపట్టిన దర్యాప్తు, ఛేదించిన కేసుల్లో ఉత్తమంగా ఎంపిక చేసిన కేసులకు “అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్” అవార్డుకు ఎంపిక చేసి, రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేస్తారు.
2024 ఏడాదికి నాలుగవ క్వార్టర్ కు వివిధ జిల్లాల కేసుల దర్యాప్తును పరిశీలించి, విజయనగరం జిల్లా వన్ టౌన్ పోలీసులు ఛేదించిన డిజిటల్ అరెస్టు కేసుకు ఏబీసీడీ అవార్డుల్లో మూడవ స్థానం లభించిందన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ వి.ఎల్.ప్రసన్న కుమార్, కానిస్టేబుల్ వై.రామరాజు లతోపాటు కేసు దర్యాప్తులో ఎప్పటికప్పుడు దిశా నిర్ధేశం చేసి, ఆయా రాష్ట్రాల పోలీసుల సహాయ, సహకారాలు లభించే విధంగా చర్యలు చేపట్టిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కు రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎబిసిడి అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు.
ఈ కేసులో ఫిర్యాది సకాలంలో పోలీసులను ఆశ్రయించడం, నేషల్ సైబరు క్రైం పోర్టల్ ఫిర్యాదు చేయడం వలన నిందితుల ఖాతాల్లోని 22 లక్షలను ఫ్రీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు జమ్ము కాశ్మీర్ కు చెందిన ఎ-1 ముమిన్ తారిక్ భట్ ను అరెస్టు చేసామన్నారు. ఎ-1 ముమిన్ తారిక్ భట్ ఇచ్చిన సమాచారంతో వన్ టౌన్ ఇన్స్పెక్టరు ఎస్.శ్రీనివాస్ మరియు ఇతర పోలీసు బృందం మహారాష్ట్ర వెళ్ళి, డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించిందనట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ ముఠా టెలిగ్రాం యాప్ ద్వారా గ్రూపుగా ఏర్పడి, దేశ వ్యాప్తంగా ఇదే తరహాలో డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలకు పాల్పడుతూ, పెద్ద మొత్తంలో డబ్బులను దోచుకుంటున్నారన్నారు. ఎ-2 ఖసిడ్జి చంద్రకాంత్ సుతార్ (24), ఎ-3 క్లెవిన్ గ్లెన్ బ్రిట్టో (21) ఎ-4 నితిన్ నందలాల్ సరోజ్ (23), ఎ-5 సైఫ్ తలమీ దమంద్ (31) లు ముంబయి, పూణేకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసారన్నారు. నిందితుల వద్ద నుండి 10 లక్షల నగదు,.9.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఆరు మొబైల్ ఫోన్లును సీజ్ చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అధికారులకు పవర్ పాయింట్ప్రె జెంటేషను ద్వారా వివరించారు.
ఈ ఏబీసీడీ అవార్డుల్లో వెస్ట్ గోదావరి పోలీసులకు ప్రధమ బహుమతి, సత్యసాయి జిల్లా పోలీసులకు ద్వితియబహుమతి, విజయనగరం జిల్లా పోలీసులకు తృతీయ బహుమతి, గుంటూరు జిల్లా పోలీసులకు కన్సోలేషను బహుమతి లభించాయి. మంగళగిరి రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇంటిలిజెన్సు అడిషనల్ డిజి మహేష్ చంద్ర లడ్డా, మధుసూధన రెడ్డి, ఐజి కే.శ్రీకాంత్, ఆకే రవికృష్ణ, హరికృష్ణ, రవి శంకర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.