విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు శాఖ సహా.. ఇతర శాఖలకు తెలంగాణ ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. 2019, 2020 సంవత్సరానికి గాను సైబరాబాద్ లో 93 మందికి పోలీస్ సేవా పతకాలు వరించాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందికి సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పోలీస్ సేవా పతకాలను అందజేశారు.
ఇదివరకు సేవా పతకాలకు ఎంపికైన వారికి సెక్షన్ నుంచి అందజేసేవారు. అయితే ఇందుకు భిన్నంగా ఈసారి సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సిబ్బందిని సత్కరించారు. వీరిలో పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఏసీపీ ర్యాంక్ వరకూ ఉన్నారన్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజా రక్షణ, విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభను కనబర్చిన పోలీస్ సిబ్బందికి గుర్తింపు నిచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ఇస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కొత్త సంవత్సరంలో రెండు సార్లు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు, కొత్త సంవత్సరంలో ఈ పతకాలను అందజేస్తోందన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు ప్రతీ జిల్లాలోనూ ఏర్పాటు చేయాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు, క్రమశిక్షణ, కమిట్ మెంట్ కనబర్చిన పోలీసు సిబ్బందికి పోలీస్ సేవా పతకాలు ఇవ్వడం ద్వారా పోలీసుల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు వారి పని తీరును మెరుగు పర్చవచ్చన్నారు. ప్రతీ ఒక్క పోలీస్ ఉద్యోగి కూడా రిటైర్ అయ్యే లోపు పతకాలు సాధించాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ఉద్దేశమన్నారు. సేవా పతకాలను అందుకోవడం వల్ల సిబ్బందిలో ఉత్సాహాన్నినింపడంతో పాటు తోటి వారికి ఆదర్శంగా తీసుకుంటారన్నారు.
సేవా పతకాలు అందుకున్న వారు ఇంతటి తో ఆగకుండా రెట్టింపు ఉత్సాహంతో పని చేసి మరిన్నిపతకాలను సాధించాలన్నారు. అలాగే ఇతర సిబ్బంది కూడా పతకాలను అందుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా పతకాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. అవార్డు అందుకున్న వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారం లేనిది విధుల్లో ఉత్తమ పనితీరు కనబర్చడం సాధ్యం కాదన్నారు. అదే విధంగా పోలీస్ మెడల్స్ కు సంబంధించి ప్రపోజల్స్ ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించిందన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ సిబ్బంది మాట్లాడుతూ భవిష్యత్తులో సమాజంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఏడీసీపీ అడ్మిన్ లావణ్య ఎన్ జె పి, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, సీఏఆర్ సీఎస్ డబ్ల్యూ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ లక్ష్మి నారాయణ, ఎస్టేట్ ఆఫీసర్ సంతోష్, ఆర్ఐ లు, ఆర్ఎస్ఐ లు, రిటైర్డ్ ఎంప్లాయిస్ తదితరులు పాల్గొన్నారు.