బడంగ్పేట్ టీఆర్ఎస్లో ముసలం మొదలైంది. ఆ ప్రాంతం గులాబీ పార్టీకి చెందిన కొందరు నేతలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక గులాబీ నేతల తీరుతో తీవ్రంగా విభేదిస్తున్నారనేది తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే పార్టీలు మారేందుకు పలువురు గులాబీ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
కాగా తాజాగా బండగ్పేట్ సీనియర్ నాయకులు పెద్దబావి సమర సింహారెడ్డి… బీజేపీలో చేరారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సమర సింహారెడ్డి మాట్లాడుతూ.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి హయాంలో పార్టీ సీనియర్లకు, కార్యకర్తలకు సరైన గౌరవం దక్కడం లేదన్నారు. ఎన్నోఏళ్లుగా మంత్రి వెంట నడిచిన తన కుటుంబ సభ్యులకు, పార్టీ కండువాలు మోసిన యువతకు టీఆర్ఎస్ లో సరైన ప్రాతినిధ్యం ఇవ్వటం లేదని ఆరోపించారు. అందుకే టీఆర్ఎస్ లో ఇక ఇమడలేమని నిర్ణయించుకొని అందెల ఆధ్వర్యంలో బీజేపీలో చేరామని స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ పటిష్టతకు అభ్యున్నతికి పార్టీ సీనియర్ నేతలతో కలిసి తోడ్పాటు నందిస్తామని ఈ సందర్భంగా సమర సింహారెడ్డి పేర్కొన్నారు.
బడంగ్ పేట కార్పొరేషన్ టీఆర్ఎస్వీ యూత్ అధ్యక్షుడు పెద్దబావి నాగనందీశ్వర్ రెడ్డి… సైతం తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం కొసమెరుపు. మహేశ్వరం నియోజకవర్గంలో అందెల శ్రీరాములు నాయకత్వంలో బీజేపీ పార్టీ పటిష్టతకు తీవ్రంగానే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనడానికి ఈ చేరికలే నిదర్శనమని పలువురు చెబుతున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు బాష, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు యాదీశ్, మహేశ్వరం బీజేపీ కన్వీనర్ ధీరజ్ రెడ్డి, కడారి జంగయ్య యాదవ్, పిట్ట ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్ గౌర రమాదేవి శ్రీనివాస్, నడికుడి యాదగిరి, జీఎస్ దొడ్డి మల్లికార్జున్, బీజేవైఎం అధ్యక్షుడు రాళ్లగుడెం రామకృష్ణారెడ్డి, మర్రి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.