జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై ఎస్ఆర్ నగర్ పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. ఇద్దరు కూడా శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా, మతఘర్షణలకు తావిచ్చేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులు శుక్రవారం ఈ ఇరువురిపై కేసులు నమోదు చేశారు.
శాంతిభద్రతలపై నగర సీపీ, డీజీపీ అంజనీకుమార్, మహేందర్రెడ్డిలు గతంలోనే మాట్లాడుతూ.. చట్టానికి లోబడి ఆయా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, శాంతిభద్రతలను రెచ్చగొట్టేలా ఎవ్వరూ వ్యవహరించకూడదని, మత విద్వేశాలు లాంటి ప్రసంగాలు చేయవద్దని, అలాగే సోషల్ మీడియాలో వచ్చే వాటిపై కూడా నిఘా ఉంచామని తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంతటివారినైనా వదిలేది లేదని హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలోనే గత మూడు నాలుగు రోజులు వీరిద్దరి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.