తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9 నుండి 27వ తేదీ వరకు జరుగుతున్న భాష్యకారుల ఉత్సవంలో భాగంగా ఏప్రిల్ 18న సాత్తుమొర జరుగనుంది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సాత్తుమొర నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ భాష్యకార్లవారికి విశేష సమర్పణ చేస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీ భాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు.