ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల నేపధ్యంలో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే, బీహార్లో ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్కు సంబంధించిన కేసు ఏదీ వెలుగులోకి రాలేదు. అయినప్పటికీ ప్రభుత్వం దానిని సమర్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధం అవుతోంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోకుండా ప్రవేశించడం కుదరదు. అలా చేసిన వారిపై చర్యలు తీసుకోవచ్చు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారు ప్రభుత్వ కార్యాలయాల్లోకి రాకుండా బీహార్ లో నిషేధం విధించారు. ప్రభుత్వం తక్షణమే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది.
కోవిడ్-19కి సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో పలు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలన్నీ డిసెంబర్ 1 నుంచి 15 వరకు అమలులో ఉంటాయి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే.. విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 51-60, సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటారు.