కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన భానుప్రసాద్ జాదవ్ సినీ సంగీత ప్రపంచంలో స్థానం సంపాదించాడు. చిన్ననాటి నుండి సినిమాలంటే మక్కువతో తన డిగ్రీ కళాశాల మిత్రుడైన రమేష్ సహకారంతో సినిమా రంగం వైపు అడుగులు వేశాడు. అందుకు తల్లిదండ్రులు కూడా కాదనలేదు.
అమ్మా నాన్నా తాతయ్య అందరూ ఉపాధ్యాయ వృత్తిలో జుక్కల్ నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినవారే. ఇప్పటికే పలు చిత్రాలు వెక్కిరింత, త్రికోణ, ప్రేమిస్తే చంపేస్తారా, అమ్మాయి ప్రేమలో పడితే, తాజాగా లైఫ్ స్టైల్ తదితర సినిమాలకు సంగీతాన్ని అందించి సినిమా రంగంలో తన ప్రతిభను కనబరుస్తున్నాడు.
ఈయన సంగీత సారధ్యంలో అనేక విజయవంతమైన లఘు చిత్రాలు, సీరియళ్లు ఉండడంతో తనకు మరింత క్రేజ్ ఏర్పడింది. ఉపాధ్యాయ వృత్తి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన అభిరుచులకు అనుగుణంగా తన కుటుంబ సభ్యులు బంధు మిత్రుల సహకారంతో సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకోవడంతో వెనుకబడిన ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గం కు ప్రాధాన్యత సంతరించుకుంది.
కళాకారులను అందిస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాధాన్యత గల నిర్మాతగా పేరొందిన దిల్ రాజు కూడా జిల్లా వాస్తవ్యుడే. ఆయనతో పాటు వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర తదితర కళాకారులు ఎందరో ఈ ప్రాంతం వారు ఉన్నారు.