ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బిజెపి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలుకావడం బిజెపికి ప్రమాదఘంటికలు మోగుతున్న సూచనలు వెల్లడిస్తున్నది.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసి, అయోధ్య, మధుర, లక్నో జిల్లాల్లో బిజెపిని కాదని ప్రజలు సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేశారు. మరీ ముఖ్యంగా ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో అత్యధిక స్థానాలను సమాజ్ వాది పార్టీ గెలుచుకున్నది.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో 40 జిల్లా పంచాయితీ స్థానాలు ఉండగా అందులో సమాజ్ వాది పార్టీ 15 స్థానాలను గెలుచుకున్ని. బిజెపి కేవలం 8 స్థానాలలో మాత్రమే విజయం సాధించింది.
బిఎస్పి ఐదు స్థానాలలోనూ, అప్నాదళ్ మూడు చోట్ల, ఎస్బిఎస్ పార్టీ ఒక చోట, స్వతంత్రులు మూడు చోట్ల విజయం సాధించారు.
ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యానాథ్ అనుసరిస్తున్న విధానాలు గ్రామీణ ప్రజలకు ఆకట్టుకోలకపోతున్నాయనడానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.
దీర్ఘకాలంగా కొనసాగుతున్న రైతుల ఉద్యమం తీవ్ర ప్రభావం చూపినట్లు కూడా ట్రెండ్ సూచిస్తున్నది. గత నాలుగు సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్ లో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయింది. ఇవన్నీ బిజెపి విజయావకాశాలను దెబ్బ తీశాయి.