SRSPముంపు గ్రామ ప్రజల అవసరాల కోసం ఉంచిన భూమిని డి వన్ పట్టాల పేరుతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనుచరులు ఆక్రమించుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కృష్ణా గోదావరి జలాల బిజెపి రాష్ట్ర కన్వీనర్ రావుల రామ్ నాథ్ ఆరోపించారు.
నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామస్తులు ఈ రోజు బీజేపీ కార్యాలయంలో ఆయనను కలిసి తమ గ్రామంలో ఉన్న డి వన్ పట్టాల ఆక్రమణ గురించి వివరించారు. గతంలో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు రామ్ నాథ్ కు తెలిపారు.
బిజెపి తరపున ఆందోళన చేసి తమకు న్యాయం చేయాలని రైతులు ఆయనను కోరారు. ఈ సందర్భంగా రావుల రామ్ నాథ్ మాట్లాడుతూ SRSP ముంపుకు గురయిన గ్రామాలకు నష్టపరిహారం కింద ఇళ్లు వ్యవసాయ భూములు ఇవ్వగా గ్రామానికి అవసరం నిమిత్తం కొంత భూమిని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.
ఆ గ్రామాలు ఆ భూమిని తమ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నాయని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయా గ్రామాలలో ఉన్న మిగులు భూమిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అండదండలతోనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆక్రమించుకుంటున్నారని అన్నారు.
ఈ భూమిని దొంగ డీ వన్ పట్టాలు సృష్టించి వాటిని ఇతరులకు లక్షల రూపాయలకు అమ్ముకుని కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆయన అన్నారు. గ్రామస్తులు అడ్డుపడితే వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీస్ కేసులు పెట్టిస్తున్నారని. నిర్మల్ జిల్లాలో దాదాపు ముప్పై ఆరు గ్రామాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
అధికార పార్టీ నాయకులు తమ పలుకుబడితో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు ఎరచూపి దొంగ డీ వన్ పట్టాల మాయాజాలంలో రైతు భూములన్నీ కూడా కబ్జా చేస్తున్నారని అన్నారు. గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఫిబ్రవరి రెండవ తేదీన ఫిర్యాదు చేయగా వాటి మీద సర్వే చేయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి జూన్ ఆరో తేదీ నాడు ఫిర్యాదు చేయగా మంత్రి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. మంత్రి కూడా భూ కబ్జాదారులకు అండగా నిలవడం రైతులకు మోసం చేయడం అన్యాయమని అన్నారు.
వారం రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే భారతీయ జనతాపార్టీ ఆయా గ్రామస్తులు రైతులతో కలెక్టరేట్ ముట్టడిస్తామని బిజెపి హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ తోట సత్యనారాయణ న్యూ సాంగ్వి ఉపసర్పంచు అశ్విన్ రెడ్డి రైతు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.