వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బిజెపి తో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. బిజెపి, జనసేన ముఖ్య నాయకుల సమావేశం విజయవాడలోని ఒక హోటల్ లో జరిగింది. సమావేశం అనంతరం బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తో కలిసి పవన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగితే కలిసికట్టుగా పోరాటం చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రాజధాని విషయంలో రెండు పార్టీలూ కలిసి పోరాటం చేస్తాయని ఆయన అన్నారు.
రాష్ట్ర అభవృద్ధి కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర జరిగే పరిణామాల పై సమావేశం లో కూలంకషంగా చర్చించామని జనసేన పార్టీ బేషరతుగా తమకు మద్దతు తెలిపిందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇక నుంచి కలసి పనిచేస్తామని, 2024 ఎన్నికలలో అధికారం లక్ష్యం గా పని చేస్తామని ఆయన అన్నారు. బిజెపి, జనసేన కలవడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లో అద్భుత ఫలితాలు సాధిస్తామని రాజ్యసభ సభ్యుడు, బిజెపి నాయకుడు జీ వి ఎల్ నరసింహ రావు అన్నారు.