73, 74 రాజ్యాంగ సవరణల అమలు చేసినప్పటికీ సుమారు 29 అధికారాలను స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం బదలాయించలేదని, నాడు తెలుగు దేశం ప్రభుత్వంగానీ, నేటి వైసీపీ ప్రభుత్వంగానీ అధికారాల బదలాయింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తక్షణమే ఆ పరిస్థితి మారాలని బిజెపి జనసేన డిమాండ్ చేశాయి.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆ రెండు పార్టీలూ నేడు విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశాయి. దేశ జనాభాలో దాదాపు 70 శాతం ప్రజలు నేటికీ గ్రామాలలోనే నివసిస్తున్నారని, గ్రామీణాభివృద్ధే దేశాభివృద్ధి అని భారతీయ జనతా పార్టీ – జనసేన పార్టీలు భావిస్తున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
నూటికి 60 శాతం నిధులు గ్రామాలకు చెందాలన్న అటల్ బిహారీ వాజపేయి సంకల్పాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారని వారన్నారు. గ్రామాలలో సురక్షిత మంచి నీటి పథకం, గ్రామీణ గృహ కల్పన, ఉపాధి హామీ పథకం అమలు, స్వచ్చభారత్ నిధుల కింద మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామీణ రహదారులు నిర్మాణం, సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా ప్రాథమిక, మాధ్యమిక విద్య, గ్రామ పంచాయతీల్లో విద్యుత్ ఆదా కొరకు ఎల్ఈడీ బల్బుల సరఫరా, గర్భిణీ స్త్రీలకు పౌషికాహారం సరఫరా, బాలింతలకు, శిశువులకు ఆరోగ్య ఆహార పథకం లాంటి అనేక కార్యక్రమాలను నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వారు తెలిపారు.
అందుకే బిజెపి జనసేనను ప్రజలు ఆదరించాలని వారు కోరారు. నాడు టీడీపీ, నేడు వైసీపీ ప్రభుత్వాలు గ్రామీణ వ్యవస్థలపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కేంద్రం ఇచ్చే నిధులను మళ్లించడమే కాకుండా అధికారాలను స్థానిక సంస్థలకు ఇవ్వడంలేదు. వైసీపీ ప్రభుత్వం చర్యలవల్ల వెనకబడిన వర్గాలు దాదాపు 10 శాతం మేర రాజ్యాధికారం కోల్పోయాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని తరలింపు విషయంలో రూ.5 కోట్లు ఖర్చుతో న్యాయవాదులను ఏర్పాటు చేసుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం బి.సి.ల హక్కుల విషయంలో అలాంటి శ్రద్ధ చూపలేదు. కేవలం కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రూ.4 వేల కోట్ల నిధులు పొందేందుకే ఈ నెల 31లోగా ఎన్నికలు చేయాలని హడావిడి పడింది అని డాక్యుమెంట్ లో పేర్కొన్నారు.
గ్రామాల్లోని చెత్తను సేకరించి దాని ద్వారా బహుళ ప్రయోజనాలు పొందేలా (కంపోస్టు) విద్యుత్ ఉత్పత్తితోపాటు కాలుష్య నియంత్రణ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పెద్దయెత్తున సాయం అందిస్తోంది. మహాత్మా గాంధీ ఆశయం, అటల్ బిహారీ వాజపేయి సంకల్పం, నరేంద్ర మోదీ మనోరథం, పవన్ కళ్యాణ్ ఆలోచనలతో గ్రామీణాభివృద్ధే దేశాభివృద్ధి అని భావించి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే దృక్పథంతో బీజేపీ – జనసేనలు ముందడుగు వేస్తున్నాయి.
గ్రామీణ రైతాంగానికి చేయూతనిస్తూ సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసి రైతు ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని వారు పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు వచ్చే నిధులకు పూర్తి జవాబుదారీగా వ్యవహరిస్తాం.
నిధులకు బిజెపి, జనసేన పార్టీలు ధర్మకర్తల పాత్ర పోషిస్తాయి. స్థానిక సంస్థలకు అవసరమైన నిధులు సింహ భాగం కేంద్రం నుంచే వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ పంచాయతీలకు నేరుగా నిధులు అందిస్తుంది. వీటిని సక్రమంగా సద్వినియోగపరుస్తాం. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం మా విధి.
ఇందులో భాగంగా జల వనరులను సంరక్షిస్తూ శుద్ధ జలాలు ఇచ్చేందుకు అవసరమైన ప్లాంట్ల ఏర్పాటును ప్రాధాన్య కార్యక్రమంగా చేపడతాం. ప్రతి ఇంటికీ సురక్షిత జలాలు ఇచ్చేందుకు ‘హర్ ఘర్ జల్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో సమర్థంగా అమలు చేస్తాం.
కేంద్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం ద్వారా స్థానిక సంస్థలకు నిధులు అందుతున్నాయి. వాటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తాం. గ్రామీణ, పట్టణ, నగరాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును ప్రాధాన్య అంశంగా చేపడతాం. నగరాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. వీటి నిధులను వినియోగించడంలో పారదర్శకంగా వ్యవహరిస్తాం.
పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహణను కచ్చితంగా అమలు చేస్తాం. గ్రామాలలో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు తెలియజేయడం మా ఉద్దేశం. పంచాయతీ ఆదాయ వ్యయాలను, బడ్జెట్ ను ప్రజలకు గ్రామ సభలలో వెల్లడిస్తాం. గ్రామీణ ప్రాంత యువతకు నైపుణ్యాలు అభివృద్ధి చేసే శిబిరాలను నిర్వహిస్తాం. ప్రతి గ్రామంలో, పట్టణాల్లోని ప్రతి వార్డుల్లో ప్రజా భద్రత కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీలు ప్రధానంగా మహిళా భద్రతను చేపడతాయి. విద్యార్థినులకు ఆత్మ రక్షణ విద్యల్లో తర్ఫీదును ఈ కమిటీలు అందిస్తాయి. బీజేపీ జనసేన కూటమితోనే గ్రామ సీమలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వారు విజన్ డాక్యుమెంట్ లో పేర్కొన్నారు.