ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయనిబిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో బిజెపి పట్టణ అధ్యక్షుడు హాసన్ ను పోలీసులు విచారణ పేరుతో పిలిచారని ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాష్ట్రంలో దారుణ పరిస్థితులను సూచిస్తున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చిన హాసన్ ను పోలీసుల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాహనాలలో వచ్చి ఎత్తుకెళ్లారని ఆయన తెలిపారు.
పది మందీ చూస్తుండగానే పోలీసుల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాసన్ ను ఎత్తుకెళ్లి హత్యాయత్నం చేశారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
పోలీసులు ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. పోలీసులే ఇలా లొంగిపోతే ఇక సమాజంలో శాంతిభద్రతలు ఎవరు కాపాడతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మానవహక్కులు ఉన్నాయో లేదో హోం మంత్రి తక్షణమే సమాధానం చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తమ నాయకుడిని కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేసిన వారిపై తక్షణమే కేసలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వారిని అరెస్టు చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.
కళ్లప్పగించి చూస్తూ కూర్చున్న పోలీసులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.