జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు సందర్భంగా గ్యాలరీ కూలిన ఘటనలో ఏరియా హాస్పిటల్, అమ్మ హాస్పిటల్ ,గణేష్ హాస్పిటల్, ఆరంజ్ హాస్పిటల్ ,మెట్రో హాస్పిటల్ లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు పరామర్శించి వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ గ్యాలరీ కూలిన ఘటనలో 300 మందికి పైగా తీవ్ర గాయాలు అయితే మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏరియా హాస్పిటల్ కు వచ్చి కేవలం ఏడుగురికి మాత్రమే గాయాలు అయినాయి అని చెప్పడం సిగ్గుచేటని అన్నారు.
గ్యాలరీ కూలి వందలాది మంది తీవ్రంగా గాయపడితే అవేమీ పట్టనట్టు వెంటనే కబడ్డీ పోటీలను ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇంత పెద్ద సంఘటన జరిగి ప్రజలు ప్రాణభయంతో ఉంటే ఎవరికీ ఏమీ కాలేదు అని సూర్యాపేట ప్రజానీకాన్ని నమ్మించడం కోసం కబడ్డీ పోటీలను వెంటనే ప్రారంభించారని ఆయన అన్నారు.
ఉచిత చికిత్స అందిస్తామని కేవలం కల్లబొల్లి కబుర్లు చెప్పారని, తీవ్రంగా గాయపడిన వారు ఇక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో తమ స్వంత ఖర్చులతో ఖమ్మం, హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.
మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు కమిషన్లకు కక్కుర్తి పడడం వల్లనే ఈ ప్రమాదం జరిగి వందలాది మందికి గాయాల పాలయ్యారని ఆయన ఆరోపించారు.