ఇప్పుడు ఎవరు దొంగలు ఎవరు రైతుల పక్షపాతి అనేది రైతులకు స్పష్టమయిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తో బాటు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, జెడ్పి చైర్ పర్సన్ దాఫెదర్ శోభ రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందు,జి ల్లా గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్, నిట్టూ వేణుగోపాల్, టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. యాసంగిలో ధాన్యం తీసుకొము అని కేంద్రం చెబితే ధాన్యం తీసుకునేలా రాష్ట్రంలో నిరసనలు తెలిపినం.
తీర్మానాలు చేసినం. నల్లజెండాలు ఎగురవేసినం. చివరికి సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీలో రైతు దీక్ష చేపట్టినా కూడా కేంద్రం తమ బాధ్యతల నుంచి తప్పించుకుంది అని అన్నారు. తెలంగాణలో నూకల బియ్యం వస్తాయని, వాటిని తీసుకోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెబితే కేంద్రమే ధాన్యం కొనేలా మేము ఒప్పిస్తామని ఇక్కడి బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చెప్పారని మంత్రి గుర్తు చేశారు.
వరి వేయండి అని బండి సంజయ్, రా రైస్ అయినా బాయిల్డ్ రైస్ అయినా కేంద్రమే కొంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టారని చివరకు తోక ముడిచారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని, క్వింటాలుకు 1960 రూపాయల మద్దతు ధరతో తామే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని మంత్రి తెలిపారు.