రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చొరవ చూపి ఆ ప్రాంతానికి న్యాయం చేయాలని బిజెపి ప్రతినిధి బృందం కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన బిజెపి ప్రతినిధి బృందం నేడు ఢిల్లీలో ఆయన నివాసంలో కలిసింది.
విజయవాడలో జరిగిన నీటి రంగ నిపుణులు రౌండ్ టేబుల్ సమావేశంలో వారి సలహాలు సూచనలు కేంద్ర మంత్రి కి సోము వీర్రాజు వివరించారు. కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో సభ్యులు సోము వీర్రాజు తో పాటు మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు సి.ఎం.రమేష్, టి.జి.వెంకటేష్, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, పివిఎన్ మాధవ్, భానుప్రకాశ్ రెడ్డి తదితరులు వున్నారు.
పోలవరం నిర్వాసితులు, ముంపు గ్రామాల సమస్యలను సోము వీర్రాజు బృందం మంత్రికి వివరించింది. ఆర్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇప్పటి వరకూ సాయం అందలేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్ట్ ల స్టేటస్ వివరించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేజర్,మైనర్ ప్రాజెక్టులకు సంబంధించి చర్చించారు.