సోషల్ మీడియా వేదికగా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్, కేసీఆర్ కిట్ లలో సగం వాటా కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని తప్పుడు సమాచారంతో సోషల్ మీడియాలో వీడియో లు చక్కర్లు కొడుతున్నాయని, ఈ వీడియో నిగ్గు తేల్చాలని వినోద్ కుమార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కు సూచించారు.
ఆ వీడియో ఫేక్ అయితే తక్షణమే ఖండించాలని, లేదంటే చర్చకు రావాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. సమగ్ర గణాంక సమాచారంతో త్వరలోనే ప్రజలకు వాస్తవాలను వివరించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రం వాటా ఏమీ లేదన్నారు. ఎవరెన్ని ప్రచారాలు చేసినా.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి, వేములవాడ పట్టణాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులతో వినోద్ కుమార్ శుక్రవారం సమావేశమయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో, సమిష్టిగా ఎన్నికల్లో దూసుకుని వెళ్లాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.
ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని, అతి విశ్వాసం ప్రమాదకరమని వినోద్ కుమార్ టీఆర్ఎస్ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు సుంకే రవికుమార్, సీహెచ్ రమేష్ బాబు, జీహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.