తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ముఖ్యమంత్రి జగన్ ను శ్రీమహావిష్ణువుతో పోల్చడాన్ని మఠాధిపతులు పీఠాధిపతులు ముఖ్యంగా బిజెపి నాయకులు ప్రశ్నించరా? సమర్థిస్తున్నారా?ఎందుకు మౌనంగా ఉన్నారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
వ్యక్తి పూజ బానిసత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు. గోవింద నామస్మరణ, వేద మంత్రాలు నిత్యం పలికే తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు సీఎం జగన్ మహావిష్ణువులా అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తున్నారని పత్రికాముఖంగా చెప్పడం శ్రీవారి భక్తుల మనస్సులను గాయ పరిచిందని ఆయన అన్నారు.
రమణ దీక్షితులు గతంలో హుండీలో భక్తులు కానుకలు వేయకండి అని పిలుపునిచ్చిన విషయాన్ని నవీన్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. శ్రీవారి ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని కూడా ఆయన చెప్పారని గుర్తు చేశారు.
శ్రీవారి పింక్ డైమండ్ మాయం అయిందని బహిరంగ ప్రకటన చేసింది కూడా రమణ దీక్షితులేనని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ని శ్రీమహావిష్ణువుతో పోల్చడం వలన ఏపీ సీఎం కు మంచి కన్నా హిందువులంతా ఆవేదనతో చర్చించుకునే అవకాశం కల్పించారని ఆయన అన్నారు.
రమణ దీక్షితులుకు సీఎం పై అభిమానం ఉంటే ఒంటిపై పచ్చబొట్టు పొడిపించుకోవచ్చు శ్రీవారి భక్తులకు ఎవ్వరికీ ఎటువంటి అభ్యంతరము లేదని ఆయన అన్నారు.