వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దోచుకుతినే ప్రభుత్వంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అభివర్ణించారు. పంటకొనుగోళ్లు, రవాణా, సంచులు, చెల్లింపుల్లో వ్యవసాయ, పౌరసరఫరా శాఖ అధికారులు, మంత్రులు అవినీతిలో భాగస్వాములై రైతులను దోచుకుతింటున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రికి పాలనపై అవగాహనలేదని, కానుకలు ఇవ్వడమే పాలనగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు పాలనపై పట్టులేదని, అధికారులు, మంత్రులు ఏం చేస్తున్నా తెలుసుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా, అవినీతి లేకుండా సక్రమంగా యంత్రాంగం నడపడమే పాలన అనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలని అన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనదీక్షను మంగళవారం చేపట్టింది. రాజమండ్రి నుంచి జరిగిన నిరసనదీక్షలో పార్టీ అధ్యక్షులు సోమువీర్రాజు, ముఖ్యనాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేసి నష్టాలపాలుచేసిందన్నారు. సకాలంలో పంటను సేకరించడం లేదని, అధికారులు, దళారులు కుమ్మకై పంట కొనుగోళ్లలో రైతులను దోపిడి చేస్తున్నారని, దోపిడిని అరికట్టాలని, కొనుగోలు చేసిన ధన్యానికి సకాలంలో నగదును చెల్లించడం లేదని ఆయన అన్నారు.
రైతుల నుంచి ధాన్యం సేకరణ, నగదు చెల్లింపు విధానం లోపభూయిష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ఈ ఏడాది 45 లక్షల టన్నుల ధాన్యం కొనగోలుచేయాలని లక్ష్యంగా నిర్ణయించి ఇప్పటికి 21 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు.
సేకరించిన ధాన్యానికి డబ్బు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సరైన ధర, సకాలంలో ఇవ్వకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుని వేల కోట్లు నష్టపోతున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో స్లిప్పులు ఇవ్వడం లేదు.
రవాణాకు డబ్బులు ఇస్తున్నామని పౌర సరఫరాల శాఖ అధికారులు ఇవ్వడం లేదు. మొత్తం వారే తినేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఈ అంశంపై అవగాహన లేదు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరగాలి అని ఆయన అన్నారు.