తెలంగాణలో అధికారులు అధికార పార్టీ ఆదేశాలు పాటించడం తప్ప ప్రోటోకాల్ నిబంధనలు పాటించడం మర్చిపోయినట్లున్నారు.
అదీ కూడా వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక ఆదివాసీ ఎంపికి ఘోర అవమానం చేశారు. ఈ సంఘటన కొమరం బీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది.
బెజ్జూర్ మండలం కృష్ణ పల్లి హైలెవెల్ బ్రిడ్జి శంకుస్థాపన కోసం ఎంపీ సోయం బాపురావు వచ్చిన సందర్భంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పుడు అధికారులు చేసిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నిధులతో చేపట్టనున్న ఈ బ్రిడ్జి కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తమ పేరుతో శిలాఫలకం చెక్కించుకుంది.
కేంద్ర నిధులతో ప్రారంభించే పథకాలకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి పేరు స్థానిక ఎంపి పేరును శిలాఫలకంపై రాయాల్సి ఉంటుంది.
సహాయ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేరు పెట్టుకోక పోవడంపై ఆదివాసి ఎంపీ సోయం బాపురావు తీవ్రంగా ఆక్షేపించారు. దానితో పాటు తన పేరును ప్రోటోకాల్ ప్రకారం పెట్టకపోవడం పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిజెపి కార్యకర్తలు నాయకులు శిలాఫలకాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం కొత్త శిలాఫలకాలు ఏర్పాటు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్లు నడుచుకుంటే అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన అన్నారు.