తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న పక్షపాతవైఖరిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో “తెలంగాణ రైతు గోస-బీజేపీ పోరు దీక్ష” నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర దళిత మోర్చ ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అరకొర విధానాలతో రైతులను ఆగం చేస్తున్నదని అన్నారు.
పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు.
రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు వేములవాడలోని తన స్వగృహంలో ఆయన ఒక రోజు దీక్ష నిర్వహించారు.
రైతు తీసుకువచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ధాన్యం తడిసినందున అలాంటి తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
తాలు, తరుగు పేరుతో రైతులను ఒక బస్తా కు కిలో నుండి మూడు కిలోల వరకు తీసేస్తున్నారని ఇది అన్యాయమని ఆయన తెలిపారు.
అందుకే తరుగు అనే పేరుతో రైతులను వేధించవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రైతుబంధు వెంటనే ఇవ్వాలని, రుణ మాఫీ చెయ్యాలని దీక్ష చేపట్టినట్లు కుమ్మరి శంకర్ తెలిపారు.