కడప జిల్లా ప్రొద్దుటూరులోని జిన్నా రోడ్డు లో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తే తాము కూల్చేస్తామని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.
‘‘టిప్పు సుల్తాన్ విగ్రహం తో నే మీ పతనం మొదలు అవుతుంది’’ అంటూ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.
ప్రొద్దుటూరు లో విగ్రహ ఏర్పాట్లు ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు కొసం టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆయన అన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి టిప్పు సుల్తాన్, కసబ్ ,అఫ్జల్ గురు లాంటి వారు దేశ భక్తులు లాగా కనిపిస్తున్నారని విష్ణు వర్ధన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ఇప్పుడు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టి ఆ తర్వాత అఫ్జల్ గురు విగ్రహం కూడా పెట్టడానికి సిద్ధం అవుతారని ఆయన ఎద్దేవా చేశారు.
టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు వెనుక తప్పకుండా ఒక కుట్ర కోణం ఉంది. ప్రొద్దుటూరు లో కులాల,మతాల మధ్య చిచ్చు పెట్టేలా లాగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారు.
దీన్ని బిజెపి ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు అని ఆయన అన్నారు.
టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదం నేపథ్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరు లో బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి, జిల్లా బీజేపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు చేయనున్న జిన్నా రోడ్డు ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధం అయిన బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా అక్కడ ఉద్రికత్త పరిస్థితులు నెలకున్నాయి.