ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం అయిన గజ్వేల్ లో ఒక దళితుడు ఆత్మహత్య చేసుకోవడం సిగ్గుచేటని హైదరాబాద్ లోని అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి కన్వీనర్ ఏడెల్లి అజయ్ కుమార్ అన్నారు. దళితుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో భాగంగా ఆయన తన ఇంటిలోనే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
తన 13 గుంటల భూమిని రికార్డు ల్లోకి ఎక్కించడం లేదన్న బాధతో కలతచెంది నరసింహులు అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. నరసింహులు మరణం ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యగా భావిస్తున్నాం.
గత కొన్ని రోజులుగా దళితులపైన టిఆర్ఎస్ పార్టీ, ఎం ఐ ఎం పార్టీ నాయకులు దళితులపై అఘాయిత్యాలకు పాల్పడుతూ దళిత, గిరిజన, బహుజనులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. 4 రోజుల క్రితం పరకాలలో ఒక దళిత యువకుణ్ని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు హత్య చేయడం, రెండు మాసాల క్రితం చాదర్ ఘాట్ లో ఒక దళిత మైనర్ బాలిక పైన ఎంఐఎం నేత షకీల అత్యాచారం చేయడం క్షమించరాని నేరాలని ఆయన అన్నారు.
గతంలో ఇసుక లారీలతో ప్రమాదాలు జరుగుతున్నాయని అడ్డుకున్న సిరిసిల్ల ప్రాంతంలోని దళితులను అనాగరికంగా, పాశవికంగా, క్రూరంగా, హింసించిన సంగతి తెలిసిందేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo దళిత వ్యతిరేక విధానాలని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఖండిస్తున్నామని ఆయన అన్నారు.