ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కను అడ్డుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పులివెందులతో సహా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రధాన రహదారులు గోతులమయమై ప్రయాణికులకు ప్రమాదాలు జరుగుతున్నా, ఆర్టీసీ బస్సులు ఆ గోతుల్లో పడి బయటకు రాలేని పరిస్థితులు ఎదురవుతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం కనీసం బస్సు సౌకర్యం కూడా లేని గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో ప్రజల ఇళ్ళను కూల్చడం ఏ రకమైన అభివృద్ధో ప్రభుత్వం సమాధానం చెప్పాలి? అని ఆయన ప్రశ్నించారు.
ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షతో రాష్ట్ర ప్రభుత్వమే కావాలని చేయించిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరాల తరబడి అభివృద్ధి కోరుకొంటున్న చోట చిన్న శిలాఫలకం కూడా వేయని వైసీపీ ప్రభుత్వం, గ్రామ ప్రజలు కూడా కోరుకోని చోట అభివృద్ధి పేరు చెప్పి ఇలాంటి దాష్టీకాలకు పాల్పడటం ఎంత వరకు సమంజసమో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యలు కాకపోతే ఒక గ్రామంలో 120 అడుగుల వెడల్పు గల రోడ్డు వేయడం ఎక్కడైనా చూశామా? ఇది ముమ్మాటికీ జనసేన సభకు స్థలం ఇచ్చారన్న కక్షతో రాష్ట్ర ప్రభుత్వమే కావాలని చేయించిందని ఆయన అన్నారు.
పైగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆ గ్రామాన్ని సందర్శిస్తుంటే శత్రువులు దేశంలోకి చొరబడకుండా దేశ సరిహద్దుల్లో కంచె వేసినట్లు, ఆ గ్రామ సరిహద్దుల్లో కంచె వేయడం రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణికి అద్దం పడుతోంది. కక్ష సాధింపు ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసిన ఇళ్ళను పునఃనిర్మించి ఇవ్వాలని బిజేపి డిమాండ్ చేస్తోందని ఆయన తెలిపారు.