ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నేతల కాళ్లదగ్గర కూర్చుంటున్న బిజెపి నేతలకు ఇక కష్టకాలమే. బిజెపి అధినాయకత్వానికి ఇప్పటికే అలాంటి వారి జాబితా చేరింది.
రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయాల్సిన నాయకులే ఆ పార్టీని బలిపీఠం ఎక్కించారనే నివేదిక అధిష్టానానికి చేరడంతో ఆంధ్రప్రదేశ్ బిజెపిలో పెద్ద తలకాయలు అతి త్వరలో రాలిపడే అవకాశం కనిపిస్తున్నది. గత కొన్నేళ్లుగా ఎదుగు బొదుగూ లేకుండా, దేశం మొత్తం మీద అత్యంత దీనస్థితిలో బిజెపి ఉన్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే అని చెప్పవచ్చు. 2019 ఎన్నికలలో నోటా కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకొని, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం ఇక్కడి నాయకత్వపు ఘనతను చాటుతున్నది.
అందుకనే కేంద్ర నాయకత్వం కూడా ఇంతకాలం ఏపీ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని పెద్ద రాష్ట్రం ఇదొక్కటే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎటూ కేంద్ర నాయకత్వం పట్టించుకోవడం లేదు కదా అని రాష్ట్రంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఇంతకాలం ప్రవర్తించారు. తెలుగుదేశం పార్టీపై ‘‘కుల’’ కోపంతో వైసీపీతో అంటకాగారు. ఇప్పుడు ఆ జాబితా మొత్తం బిజెపి అధినాయకత్వానికి చేరింది.
కొద్దికాలం క్రితం ఏపీ పర్యవేక్షణ బాధ్యతలను మరో సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగతం) వి సతీష్ నుండి చేపట్టిన శివ ప్రకాష్ ఈ పరిస్థితుల మూలలలోకి వెళ్లి పరిశీలన చేశారు. ఈ మధ్య ఒంగోలు, విజయవాడ, రాజమండ్రిలలో జరిపిన పర్యటనలలో క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి పార్టీ అధినేత జెపి నడ్డాకు సవివరమైన నివేదిక ఇచ్చారు. దానితో ఇటీవల ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కలవడానికి కూడా జెపి నడ్డా ఇష్టపడలేదు.
ఏపీలో బిజెపి నేతలు చాలావరకు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మద్దతుదారులైతే, మరొకరు వైసిపి మద్దతుదారులు. వీరెవ్వరికి సంబంధం లేనివారు కొందరున్నా వారిని పట్టించుకొనే వారు లేరు. వెంకయ్యనాయుడు క్రియాశీల రాజకీయాలలో ఉన్నంతవరకు ఆయన అభీష్టం మేరకే అన్ని జరుగుతూ ఉండేడివి.
అయితే ఆయనను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మద్దతుదారుడని ప్రచారం చేసి, ఆయనను పక్కన పెడితే గాని రాష్ట్రంలో బిజెపి పూనుకోదని అంటూ ఆర్ ఎస్ ఎస్ నాయకులతో పాటు బీజేపీలో ఒక వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దానితో ఆయనను ఉపరాష్ట్రపతిగా పంపారు. అయితే ఆ తర్వాత ఏపిలో పార్టీ పుంజుకోకపోగా గత నాలుగేళ్లలో పార్టీ పరిస్థితి రాష్ట్రంలో మరింత దారుణంగా దిగజారింది.
ఒక్క ఎమ్మెల్యే సీటు గానీ ఎమ్మెల్సీ సీటు గానీ కనీసం మునిసిపల్ స్థానాలను గాని సంపాదించలేకపోయింది. బిజెపికి ఎటువంటి బలంలేని తెలంగాణలోని దుబ్బాకలో అభ్యర్థి రఘునందనరావు వరుసగా మూడు సార్లు ఓటమి చెందిన నియోజకవర్గాన్ని వదిలి పెట్టలేదని సానుభూతితో గెలుపొందడంతో ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారమలోకి రావడమే అంటూ బిజెపి నేతలు సంబరాలు చేసుకొన్నారు.
అయితే లోలోపల జరుగుతున్నది వేరు గా బిజెపి అధి నాయకత్వానికి తెలిసిపోయింది. వైసీపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న కొందరు బిజెపి నేతలు సొంత పార్టీనే పణంగా పెడుతున్నారని అధిష్టానానికి నివేదిక అందడంతో పే టీఎం బ్యాచ్ కాళ్లలో వణుకు మొదలైంది.
(వైసీపీ కాళ్ల దగ్గరకు చేరిన నేతలెవరు? ….. వచ్చే పోస్టులో)