పశ్చిమ బెంగాల్ లో అధికారం కోసం ఆరాటపడుతున్న బిజెపి, అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వాడుకోవాడానికి తాపత్రయపడుతూనే ఉన్నది.
ప్రముఖ రాజకీయ పరిశీలకుడు, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒక సందర్భంలో మాట్లాడిన మాటల్ని బిజెపి తాజాగా వైరల్ చేస్తున్నది.
దేశంలో ప్రధాని మోడీ పాపులారిటీ పెరిగిపోయిందని అదే పశ్చిమ బెంగాల్ లో కూడా పని చేస్తుందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు.
దానికితోడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలన పట్ల వచ్చిన వ్యతిరేకత కూడా బిజెపికి ఉపయోగపడుతున్నదని ఆయన అన్నారు.
ఇప్పటి వరకూ బిజెపి ఎలా చేస్తుందనే దానిపై అవగాహన లేని పశ్చిమ బెంగాల్ ప్రజలు కొత్తదనాన్ని ఆహ్వానించడం కోసం ప్రయత్నిస్తున్నారని ఆ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా హిందీ మాట్లాడే పశ్చిమ బెంగాల్ వాసులు మోడీని అభిమానిస్తున్నారని కూడా ఆయన చెప్పిన మాటల్ని బిజెపి వైరల్ చేసింది.
దీనికి ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ లో దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. తమ పార్టీ నాయకుల మాటలను కాకుండా తన మాటలపై అంత నమ్మకంతో బిజెపి ఉండటం సంతోషదాయకమని చెప్పారు.
తను మాట్లాడిన మొత్తం ప్రజలకు చెప్పకుండా కేవలం తమకు అనుకూలంగా ఉన్న వ్యాఖ్యలను మాత్రమే బిజెపి ప్రచారం చేసుకోవడం వారి బేలతనాన్ని సూచిస్తున్నదని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
పశ్చిమ బెంగాల్ లో ఇప్పటికీ బిజెపి 100 సీట్లు దాటే అవకాశం లేదని తన మాటగా ప్రశాంత్ కిషోర్ చెప్పారు.