రాష్ట్రంలో జగన్ రౌడీ రాజ్యం నడుపుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
పోలీసులు కూడా రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అమలాపురం బయలుదేరిన తనను పోలీసులు అక్రమంగా నిర్భంధించారని ఆయన అన్నారు.
ఏలూరు డిఐజి సూచన పేరుతో తనను పోలీసులు ఒక ప్రయివేటు స్థలంలో నిర్భంధించారని, రాత్రంతా పోలీసు వాహనంలో దాదాపు 300 కిలో మీటర్లు తిప్పారని ఆయన అన్నారు.
ఎక్కడ ఉన్నానో సైతం పోలీసులు చెప్పడం లేదని ఆయన వాపోయారు. రాజకీయ పార్టీ ల నాయకుల్ని ఈ విధంగా బెదిరించడం అన్యాయమని ఆయన అన్నారు.
హిందువుల గురించి రాష్ట్రంలో మాట్లాడమే నేరంగా జగన్ ప్రభుత్వం భావిస్తుందని ఆయన అన్నారు. తనకు ఏ రాష్ట్రంలో నైనా రాష్ట్ర ప్రభుత్వ అతిథి హోదా ఉంటుందని, తాను ఎక్కడైనా పర్యటిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పించాలని ఆయన అన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో అలాంటిది కనిపించడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని జగన్, పోలీసులు కలిసి కూర్చుని రాసుకున్నట్లు కనిపిస్తున్నదని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
తనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు.