తిరుపతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.వేల కోట్ల నిధులిస్తే వైకాపా నేతలు దోచుకుంటున్నారని ఏపీ భాజపా వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దేవ్ధర్ ఆరోపించారు.
రాష్ట్రంలో ఏం జరుగుతుందో పట్టించుకునే స్థితిలో సీఎం జగన్ లేరని ఆక్షేపించారు. తిరుపతిలో నిర్వహించిన భాజపా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దేవాదాయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని సునీల్ దేవ్ధర్ ఆరోపించారు.
రాష్ట్రంలో సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని ఆయన విమర్శించారు. వైకాపా అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా అయిందని వ్యాఖ్యానించారు.
తెరాస ప్రభుత్వ వైఫల్యంతోనే దుబ్బాక ఉపఎన్నికలో ఆ పార్టీ ఓటమిపాలైందని.. ఏపీలోని వైకాపాకూ అదే పరిస్థితి తప్పదన్నారు.
తిరుపతి లోక్సభకు జరగనున్న ఉపఎన్నికలో భాజపా-జనసేన కూటమి పోటీ చేస్తుందని.. తప్పకుండా విజయం సాధిస్తామని సునీల్ దేవ్ధర్ ధీమా వ్యక్తం చేశారు.