కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలలో ఉన్న తీవ్ర వ్యతిరేకతను పసిగట్టి ఆర్థిక, రాజకీయ, అంగబలంతో ఉప ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ, వైకాపా ఉమ్మడి వ్యూహం రూపొందించాయని కాంగ్రెస్ నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాలని ఆయన కోరారు.
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు సజావుగా జరగాలంటే 7 పార్లమెంట్ నియోజకవర్గాలలో కేంద్ర పోలీసు బలగాలను రంగంలోకి దించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికలలో రిగ్గింగ్ జరగకుండా ప్రతి పోలింగ్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో ఓట్ల కొనుగోలుకు ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల పంపిణీకి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం ఉందని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో అధికార పార్టీ బ్యాలెట్ పేపర్ లపై ముందుగానే ఓట్లు వేసుకొని బ్యాలెట్ బాక్స్ లో వేసేందుకు సిద్ధమైనప్పుడు మీడియా ద్వారా బహిర్గతం కావడం ప్రజలంతా చూశారు. అదే తరహాలో రేపు పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఈవీఎం బాక్సులను పోలింగ్ స్టేషన్ల నుంచి ఇంటికి తీసుకువెళ్లి ఓట్లు వేసుకొని సాయంత్రానికి పోలింగ్ బూతులకు చేర్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత పార్లమెంటు నియోజకవర్గ ప్రజలపై ఉందని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అరాచకాలను ప్రజలు ప్రశ్నించకపోతే ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ అవుతుందని నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.