ఆయా రాష్ట ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ ధ్యేయంగా పెట్టుకుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం లోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా విస్తృత సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. మునుగోడు ఎన్నికలను ఈ రకంగా ఉపయోగించుకోవాలని భావించిందన్నారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం కూడా దీనిలో భాగమేనన్నారు. పార్టీ ఫిరాయింపులను సీపీఎం మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. గతంలో కేసీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు పార్టీ ఫిరాయింపులకు దిగినా అది రిటైల్ వ్యవహారంగా సాగిందని బీజేపీ గంపగుత్తగా ఎమ్మెల్యేల కొనుగోలుకు పూనుకుంటోందన్నారు. మతతత్వ బీజేపీకి గుణపాఠం చెప్పాలనే మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చామన్నారు. అంతమాత్రాన ప్రజావ్యతిరేక విధానాలపై కేసీఆర్తోనైనా రాజీపడేది లేదన్నారు. రాజకీయంగా కమ్యూనిస్టులకు అనుకూల వాతావరణం ఉందన్నారు.
డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో ఖమ్మంలో జరిగే ఆలిండియా వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. 5వ తేదీన నిర్వహించే బహిరంగసభకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి విజయవంతం చేయాల్సిందిగా పిలుపు నిచ్చారు. బీజేపీ పాలనలో జీడీపీ, విదేశీ మాదక ద్రవ్య నిల్వలు పడిపోయాయని తెలిపారు. గవర్నర్, ఇతర రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకొని రాష్ట్రాల హక్కులను హరించివేస్తుందన్నారు. బ్లాక్మనీ వెలికితీత పేరుతో పెద్దనోట్లు రద్దు చేసిన కేంద్రం ఒక్క పైసా వెలికితీయకపోగా దేశాన్ని మరింత అగాధంలోకి నెట్టిందన్నారు. రైతులను లక్షాధికారులను చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. వామపక్షాల పొత్తుతో టీఆర్ఎస్ అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు.
ప్రాంతీయ పార్టీలకు ఓ స్పష్టమైన విధానం ఉండదన్నారు. అవసరానికి అనుగుణంగా వ్యవహరిస్తాయని తెలిపారు. గత మూడేళ్లుగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన టీఆర్ఎస్ గతేడాదిగా బీజేపీ నుంచి ప్రతికూలత ఎదురవుతుండటంతో మతోన్మాద వ్యతిరేక శక్తులను దగ్గరకు తీస్తోందన్నారు. దీనిలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులతో పొత్తుకు ముందుకొచ్చిందన్నారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్రాల అధికారాలను కాలరాసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ కమ్యూనిస్టు దేశమైన చైనా కరెన్సీ యువాన్ పుంజుకుంటోందన్నారు. బ్రెజిల్ల్లోనూ పెట్టుబడిదారి ప్రభుత్వం కూలిపోయి లూలా నాయకత్వంలో కమ్యూనిస్టు సర్కారు అధికారంలోకి వచ్చిందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకురాలు బత్తుల హైమావతి, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, బండి రమేష్, బొంతు రాంబాబు, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, చింతలచెర్వు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.