కడప జిల్లా రామపురం బిసి కాలనీలో ఒక శవం కనిపించింది. ఆ శవం ఛిద్రం అయిన స్థితిలో ఉంది. ఆ వ్యక్తి మర్మాంగాన్ని కోసేశారు. ఇది జరిగి మూడు రోజులైంది. కేసు దర్యాప్తు ఎలా చేయాలి? చనిపోయిన వ్యక్తి ఎవరో తెలియదు. ఎవరు చంపారో అంతకన్నా తెలియదు. ఏం చేయాలి?
లక్కిరెడ్డిపల్లి పోలీసులకు ఇది ఒక సవాల్ గా మారింది. రామాపురం ఎస్ ఐ మెయినుద్దీన్ ఈ కేసును పరిష్కరించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఎక్కడా ఆధారాలు దొరకలేదు. అకస్మాత్తుగా జరిగిన ఒక సంఘటన కేసు చిక్కుముడి విప్పింది.
పోలీసులకు శవం దొరికిన ప్రదేశంలో ఒక యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని పోలీసులు గుర్తించారు. స్థానికేతరుడు కావడంతో అతడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే అతడిని పట్టుకుని ప్రశ్నించారు. ఇంకే… కేసు మొత్తం పరిష్కారం అయిపోయింది.
నిందితులు అందరి ఆనవాలూ దొరికేశాయి. అనుమానాస్పద పరిస్థితిలో పోలీసులకు పట్టుబడిన వ్యక్తి పేరు వెంకటేశన్ వినోత్ కుమార్. ఇతను తమిళనాడులోని కాంచీపురం కు చెందిన వాడు. దారుణహత్యకు గురైనవ్యక్తి పేరు ఆరుళ్ మోజహి వినోత్ కుమార్.
ఆరుళ్ కాంచీపురంలో ఆటోడ్రైవర్ కాగా వెంకటేశన్ ప్రేమించిన అమ్మాయితో అతడికి సంబంధం ఉంది. ఆ అమ్మాయి ఫొటోలు తీసి ఆరుళ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట. దాంతో ఏం చెయ్యాలో తెలియని వెంకటేశన్ మర్డర్ కు ప్లాన్ చేశాడు. ఆరుళ్ ను చంపేసి అతడి సెల్ లో ఉన్న తన కాబోయే భార్య ఫొటోలు డిలీట్ చేయాలనేది ప్లాన్.
ఆ అమ్మాయి బావ వినాయగం, తండ్రి నారాయణన్ తో కలిసి వెంకటేశన్ ప్లాన్ పకడ్బందిగా అమలు చేశాడు. తమకు మర్డర్ చేయడం రాదు కాబట్టి ప్రొఫెషనల్స్ సాయం తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఢిల్లీ బాబు, మగేష్ అనే ఇద్దరిని ఎంపిక చేసుకుని ఆరుళ్ ను కిడ్నాప్ చేసి మర్డర్ చేసి రామాపురం తెచ్చి పడేశారు.
ఇది జరిగి మూడు రోజులు అయింది కదా శవం వదిలేసి వెళ్లిన ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయం తెలుసుకోవడానికి వెంకటేశం అక్కడకు వచ్చాడు. పాపం అతడి ఖర్మ కాలి పోలీసుల కంట పడ్డాడు. పోలీసులు అతడిని అక్కడే అరెస్టు చేశారు. ఈ మర్డర్ తో సంబంధం ఉన్న మిగిలిన వారు పరారీలో ఉన్నారు.