రక్తం ఇవ్వటానికి చాలామంది భయపడతారు కానీ రక్తం ఇవ్వటం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటామని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని తుర్కయాంజల్ మున్సిపాలిటీలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి నేడు ఆయన హాజరయ్యారు.
కొత్తకూర్మ శివకుమార్ మంగమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి మున్సిపల్ చైర్మన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రక్తదానం చేశారు. ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వటం మూలంగా మన శరీరంలో కొత్త రక్తం వస్తుందని, దానితో మనం ఆరోగ్యంగా ఉంటామని ఆయన అన్నారు.
అంతే కాకుండా మనం చేసే రక్తదానం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడటమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటామని ఆయన అన్నారు. కరోనా సమయంలో రక్తం అందుబాటులో లేక చాలా మంది రోగులు ప్రాణాలను కోల్పోతున్నారని ఆయన అన్నారు. కరోన పై పోరులో డాక్టర్లు, పోలీసులు,పారిశుద్ధ్య కార్మికులు ప్రతి రోజు సేవలు అందిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారికి ధన్యవాదాలు తెలిపారు.