ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం గొప్ప విషయమని, అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం అదృష్టమని రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను అన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం జిల్లా అల్లు అర్జున్ యువత ఆధ్వర్యంలో పైడిభీమవరం లో స్వచ్ఛందంగా రక్తదానం చేసారు.
పైడిభీమవరం కళ్యాణమండపంలో సుమారు 100 మంది అల్లు అర్జున్ అభిమానులు రక్తదానం చేసారు. ప్రతి ఏడాది అల్లు అర్జున్ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లాలో ఆయన అభిమానులు పెద్దఎత్తున రక్తదానం చేస్తుండడం ఆనవాయితీగా వస్తుంది.
అందులో భాగంగానే అల్లు అర్జున్ యువత రక్తదానం చేసారు. ఈ రక్తదాన శిభిరాన్ని రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను జిల్లా అల్లు అర్జున్ అభిమాన సంఘ అధ్యక్షుడు పుక్కళ్ల నవీన్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా తైక్వాండో శ్రీను మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. సామాజిక బాధ్యతగా అల్లు అర్జున్ యువత రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారన్నారు.
రక్తదాతలను అభినందించిన తైక్వాండో శ్రీను వారికి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శానిటైజర్, శరీర ఉష్ణోగ్రతలు పరిశీలిస్తూ అనుమతించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకు మేనేజర్ మణి, చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు వైశ్యరాజు మోహన్, జిల్లా అల్లు అర్జున్ అభిమాన సంఘ టౌన్ ప్రెసిడెంట్ తలడా శేఖర్, శ్రీకాకుళం జిల్లా రామ్ చరణ్ యువత అధ్యక్షుడు మజ్జి గౌతమ్, చందు, పెయ్యాల చంటి, పంకు మురళి, పైడిభీమవరం అల్లు అర్జున యువత ప్రతినిధులు మునగాల రమణ, లంకపల్లి ఉమేష్, సింకా వాసు, సింకా నరసయ్య, బండు మహేష్ తో పాటు అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.