కరోనా లాక్ డౌన్ సమయంలో అనునిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నేడు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. బొరబండ ప్రాంతంలోని వినాయక్ నగర్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు.
టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సందర్భంగా రక్తదానం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తలసేమియా రోగులు రక్తం అందుబాటులో లేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, వారిని ఆదుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు.
లాక్ డౌన్ కారణంగా రక్తదాతలు ముందుకు రాలేని పరిస్థితి ఉండటం వల్ల రక్త కొరత ఏర్పడిందని దాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రక్త దాతలకు మినహాయింపులు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని వీలైనంత ఎక్కువ మంది రక్తదాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు పూర్తి స్థాయికి వచ్చే వరకూ రక్తదానం విరివిగా జరగాలని మాగంటి గోపీనాథ్ ఆకాంక్షించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువ మంది పాల్గొన్నందున ఈ కార్యక్రమం విజయవంతం అయిందని నిర్వాహకులు తెలిపారు.