ఈనెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని పల్నాడు జిల్లా సత్తెన పల్లిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా ఆ రోజు ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ, సంక్రాంతి ముగ్గుల పోటీలు, పార్టీ బలోపేతం కోసం సచివాలయానికి ఇద్దరు కన్వీనర్లు ఏర్పాటు చేసుకోవడం వంటి కార్యక్రమాలపై రాజుపాలెం మండల నాయకులతో మంత్రి అంబటి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని భారీగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
“రక్తదానం చేద్దాం జగనన్నకి శుభాకాంక్షలు తెలియజేద్దాం” అనే కార్యక్రమంలో రక్తదానం చేసిన వారికి ప్రత్యేక ధ్రువీకరణ పత్రం అందిస్తున్నామని వివరించారు. రక్తదానంపై అవగాహన కలిగించి రక్తదాన దాతలను తీసుకొచ్చే బాధ్యత నాయకులదేనన్నారు. నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీన సత్తెనపల్లిలో ఒక వార్డు ను ఎంపిక చేసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా రూ. 2500 ల పెన్షన్ ను రూ. 2750 ల కు పెంచుతూ ఇస్తున్న పింఛన్ ను పంపిణీ చేద్దామన్నారు. ఆయా మండలాల్లో నాయకులకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగను పరిష్కరించుకొని నియోజకవర్గ స్థాయి వైయస్సార్ సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. మొదటి బహుమతి రూ.2 లక్షలు రెండో బహుమతి, రూ.1 లక్ష, మూడు ,నాలుగు ,5 వ స్థానాలకు కూడా బహమతులు అందిస్తున్నామని వివరించారు. ముగింపు వేడుకల్లో పాల్గొనే వారికి లాటరీ ద్వారా ఆకర్షణనీయమైన నక్లేస్ బహుమతి కూడా ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రతి సచివాలయానికి పార్టీ తరపున కన్వీనర్ లను, ప్రతి క్లస్టర్ పరిధిలో ఇద్దరు గృహ సారథులను ఎంపిక చేయాలన్నారు.
ఈ ఎంపికలు నామమాత్రం కాదని కష్టపడి పని చేసే వారిని గుర్తించి వారిని ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండల కన్వీనర్ ఏపూరి శ్రీనివాసరావు, సత్తనపల్లి రూరల్ మండలం కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు, మర్రి సుబ్బారెడ్డి ,దొంతి రెడ్డి శ్రీనివాసరెడ్డి, తేలుకుట్ల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.