రౌడీషీటర్, వైసీపీ కీలక నేత, వై ఎస్ జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన బోరుగడ్డ అనిల్ కుమార్ కేసులో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్ కుటుంబాల్లోని మహిళలపై బోరుగడ్డ అనిల్ కుమార్ బూతు పదాలతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చాక బోరుగడ్డపై పలు కేసులు నమోదయ్యాయి.
ఆయా కేసుల్లో రాజమండ్రి జైలులో ఉంటూనే వైసీపీ ముఖ్యనేతలతో బోరుగడ్డ అనిల్ కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందెందుకు..తల్లికి అనారోగ్యం పేరిట ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించి..కోర్టుకు సమర్పించిన కుట్రకు ఈ కాన్ఫరెన్స్ కాల్స్లోనే ప్లాన్ జరిగిందని విచారణ అధికారులు భావిస్తున్నారు. రాజమండ్రి జైలులో బోరుగడ్డ అనిల్ కదలికలపై నిఘా లేకపోవడం, జైలు సిబ్బంది అతనికి సహకరించడమే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిజానికి జైలు నిబంధనల ప్రకారం…రిమాండ్ ఖైదీలకు వారానికి 3 సార్లు ఫోన్కాల్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. వారి మాటలు సైతం రికార్డవుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు వింటూ ఏదైనా సందేహం వస్తే జైలు సిబ్బంది అప్రమత్తమవ్వాలి. ఐతే అత్యంత వివాదాస్పద ఖైధీగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారంలో రాజమండ్రి జైలు అధికారులు ఈ నిబంధనలను పట్టించుకోలేదు. బోరుగడ్డ అనిల్ జైల్లో నుంచి మొదట ఒక నంబర్కు ఫోన్ చేసేవాడు..అవతలి వ్యక్తి.. వైకాపా ముఖ్య నేతల్ని, మరికొందరికి తన నంబర్ నుంచి కాన్ఫరెన్స్ కాల్ కలిపి బోరుగడ్డతో మాట్లాడించేవారని పోలీసులు గుర్తించారు.
ఈ కాన్ఫరెన్స్ కాల్ సంభాషణలు యథేచ్ఛగా కొనసాగినప్పటికీ జైలు సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోలేదు. బోరుగడ్డ మధ్యంతర బెయిల్పై విడుదలైన విషయాన్ని పోలీసులకు తెలపకుండా గోప్యంగా ఉంచటంపైనా విమర్శలు వస్తున్నాయి. బూతులతో, చెప్పలేని భాషతో టీడీపీ, జనసేన ముఖ్యనాయకులపై బోరుగడ్డ అనిల్ కుమార్ విరుచుకుపడడం వెనుక వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు బోరుగడ్డను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కూడా వారే సహకరించినట్లు గుర్తించారు.
తనకు సంబంధించిన సమాచారం కుటుంబీకులకు తెలియజేయటం కోసం జైలు రికార్డుల్లో తన సోదరి ఫోన్ నంబర్ను నమోదు చేయించిన అనిల్..అదే నంబరుకు కాల్ చేశారా? లేదా వేరే నంబర్లకు చేశారా? ఏయే నంబర్లకు కాన్ఫరెన్స్ కాల్స్ కలిపేవారు? అవి ఎవరివి? అనేదానిపై కాల్ డేటా రికార్డు -CDR తీసి విశ్లేషిస్తే..ఈ మొత్తం కుట్ర వెనక ఉన్న వైకాపా నాయకుల బండారం బయటపడే అవకాశముంది.