ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్రాహ్మణులకు తీరని అన్యాయం చేస్తున్నారని బ్రాహ్మణ సంఘాలు నిర్వహించిన చలో విజయవాడ ఉద్రిక్తతలకు దారితీసింది. గొల్లపూడి దేవాదాయ ధర్మాదాయ శాఖా కాంపాండ్ లో గల బ్రాహ్మణ కార్పోరేషన్ కార్యాలయం ముట్టడికి బ్రాహ్మణులు ప్రయత్నించడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి గొల్లపూడి చేరుకున్న బ్రాహ్మణ వర్గాల ప్రతినిధులు గొల్లపూడి వన్ సెంటర్ నుంచి ముట్టడికి బయలుదేరారు.
నిరసనలకు అనుమతి లేదంటూ వారిని పోలీసులు అరెస్టు చేశారు. జగన్ పాలనపై నిరసన తెలిపేందుకు శాంతియుతంగా బయలుదేరామని, బ్రాహ్మణ హక్కుల గురించి మాట్లాడే స్వేచ్చ కూడా లేదా అని బ్రాహ్మణ హక్కుల సాధన కమిటీ నేత, టీడీపీ నాయకుడు సాయునాథ్ శర్మ అన్నారు. మా జాతిని ఘోరంగా చూస్తున్న జగన్ పైనే మా పోరాటం అని ఆయన అన్నారు.
విదేశీ విద్యకు ఇచ్చే ఉపకారవేతనాలు భారతీ ఓవర్సీస్ స్కీం ద్వారా వెంటనే బ్రాహ్మణ విద్యార్థులు కి అందివ్వాలని బ్రాహ్మణ నేతలు డిమాండ్ చేశారు. కశ్యప పింఛన్లు 60 సంవత్సరాలు నిండిన వారందరికీ గతంలో ఇచ్చినట్లుగా ఒక్కొక్కరికి 3000 రూపాయలు చొప్పున ఇవ్వాలని కోరారు. చాణిక్య స్కీం ద్వారా వ్యాపార సబ్సిడీ రుణాలను వెనువెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.
నవరత్నాలలో మిళితం కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా గతంలో ఉన్న అన్ని స్కీం లు వెనువెంటనే పునరుద్ధరించాలని కోరారు. చచ్చిపోతే మట్టి ఖర్చులు గా ఇచ్చే గరుడ స్కీం ద్వారా 15000 రూపాయలు గత మూడు సంవత్సరాలుగా బకాయిలు ఇవ్వాలని వారు కోరారు. వేదం నేర్చుకునే విద్యార్థులు కి ఉపకారవేతనాలు వేదవ్యాస స్కీం ద్వారా మూడు సంవత్సరాలుగా బకాయిలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, బ్రాహ్మణ వర్గాలను అన్నివిధాలా జగన్ మోసం చేశాడని అన్నారు. ప్రభుత్వం తీరుకు నిరసన తెలిపే హక్కు మాకుంది. పోలీసులు ను అడ్డం పెట్టుకుని మా పోరాటాలు ను అడ్డుకుంటున్నారు. భవిష్యత్తులో జగన్ కు బ్రాహ్మణులు శాపం తగలక తప్పదు అని గండూరి మహేష్ అన్నారు.