శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామి వారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై దర్శనమిచ్చారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.
శ్రీవారిని దర్శించుకున్న సిజె
వాహనసేవ అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లలితకుమారి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి, ఛత్తీస్ ఘడ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్త్ ప్రతీం సాహు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సోమరజన్, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి దంపతులు, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం 8 నుండి 11 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని ఐనా మహల్ వద్ద స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు ఆలయంలో బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు ధ్వజావరోహణం జరుగనుంది.