తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీగోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు.
కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవ నిర్వహించారు.
త్రేతాయుగంలో రాముడు భక్తాగ్రగణ్యుడైన ఆంజనేయస్వామికి ఆత్మతత్త్వాన్ని బోధించినట్టు ప్రాచీనవాఙ్మయం నుండి తెలుస్తోంది.
బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి. శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.
అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
కాగా సాయంత్రం 5 నుండి 5.30 గంటల వరకు గజ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.