కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం ఉదయం 8 గంటల నుండి మోహినీ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవ నిర్వహించారు.
మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది.
దానిని పంచుకోవడంలో కలహం ఏర్పడుతుంది. ఆ కలహాన్ని నివారించి, దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహినీ రూపంలో రాములవారు ప్రకటిస్తున్నాడు.
వాహనసేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో మురళీధర్, సూపరింటెండెంట్ వెంకటేశయ్య, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.