రాష్ట్రపతి ద్రౌపతిముర్ము రాష్ట్ర పర్యటన ప్రోటోకాల్ చిచ్చుకు కారణం అయింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ విభాగం ఒక చోట ఒక లాగా మరో చోట మరో లాగా ప్రవర్తించడంతో ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రేపినట్లు అయింది. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పర్యటనకు వచ్చారు.
ఈ రోజు ఉదయం 10.30 నిమిషాలకు విజయవాడ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్. ముఖ్యమంత్రి జగన్, ఇతర మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం 11.45 నిమిషాలకు కృష్ణా జిల్లా పోరంకిలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు పౌర సన్మానం జరిగింది. అనంతరం రాష్ట్రపతి ముర్ముకు రాజ్ భవన్ లో ప్రభుత్వం విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2.35 నిమిషాలకు గన్నవరం నుండి బయలుదేరి విశాఖపట్నానికి రాష్ట్రపతి వెళ్లారు.
సాయంత్రం విశాఖలో జరుగిన నౌకాదళ ప్రదర్శనను ఆమె తిలకించారు. పైకి చూస్తే అంతాబాగానే జరిగనట్లు కనిపిస్తున్నా ప్రోటోకాల్ ప్రకారం అధికారులు వ్యవహరించలేదనే చర్చ జరుగుతున్నది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో జరిగిన పౌర సన్మానం కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైయస్.జగన్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గవర్నర్, సీఎం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేదికపై ఆశీనులయ్యారు. కార్యక్రమం ఘనంగా జరిగింది. కట్ చేస్తే విశాఖ పట్నంలో జరిగిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాల్గొనలేక పోవడంతో ఆ బాధ్యతను ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు అప్పగించింది. దాంతో ముఖ్యమంత్రి జగన్ బదులుగా ఆయన వేదికపైన ఉన్నారు. ఆయనతో బాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా ఉన్నారు.
నౌకాదళ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ కూడా వేదికపై ఆసీనులయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ను, ఆ జిల్లా ఇన్ చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన విడదల రజనిని కూడా వేదికపైకి పిలిచారు. ఇంకా పి వి సింధు లాంటి ముఖ్యఅతిథులు కూడా వచ్చారు. అయితే కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో జరిగిన పౌర సన్మానంలో ఆ జిల్లా ఇన్ చార్జి మంత్రి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజాను వేదికపైకి పిలవలేదు.
మంత్రి రోజా రాష్ట్రపతికి స్వాగతం పలికిన బృందంలో ఉన్నారు తప్ప ఆ తర్వాత వేదికపైన లేకపోవడం పలువురిని ఆశ్చర్య పరచింది. రాష్ట్ర పతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి లేదా ఆయన సూచించిన వ్యక్తి ఉన్నప్పుడు ఇన్ చార్జి మంత్రి కూడా ఉండటం ఆనవాయితి. విశాఖ పట్నంలో ఇన్ చార్జి మంత్రి విడదల రజనికి ప్రాధాన్యత ఇవ్వడం, కృష్ణా జిల్లా ఇన్ చార్జి మంత్రి రోజాను అవమానించడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది.