పే అండ్ ఎకౌంట్స్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారిపోయాయి. ఇది కొత్త విషయం కాదు కానీ తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కసరత్తు చేసి ఇచ్చిన పీఆర్ సి కొత్త వేతనంలో కూడా తమకు వాటా కావాలని పే అండ్ ఎకౌంట్స్ సిబ్బంది వేధిస్తున్నారు.
ఎవరో బయటి వారిని కాదు. సాటి ప్రభుత్వ ఉద్యోగుల నుంచే లంచాలు డిమాండ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇటీవల ప్రభుత్వం పెంచిన పిఆర్ సి ప్రకారం కొత్త జీతాలు చెల్లించాలంటే తలా ఇంత చెల్లించాల్సిందేనని పే అండ్ ఎకౌంట్స్ వారు డిమాండ్ చేస్తున్నారు.
పెరిగిన జీతాలను బట్టి రెండు వేల నుంచి 8 వేల వరకూ ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి నుంచి వారు వసూలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఉద్యోగులను సైతం పిఏఓ సిబ్బంది వదిలి పెట్టడం లేదు. డబ్బులు ఇస్తేనే కొత్త వేతనం ఇస్తామని వారు బాహాటంగా చెబుతున్నారు. నేరుగా వారు వసూలు చేయడమే కాకుండా అక్కడ మధ్య దళారులను కూడా ఉంచుతున్నారు.
ఎదురుతిరిగిన ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మధ్య దళారులు జోక్యం చేసుకుంటున్నారు. తాము పై వారికి ఇవ్వాలని, అందువల్లే వసూలు చేస్తున్నామని బాహాటంగా చెబుతున్నారు. డిపార్టుమెంట్ల వారీగా అందరూ చందాలు వేసుకుని ఇచ్చినా ఫర్వాలేదు…లేకపోతే ఎవరికి వారుగా ఇచ్చినా ఫర్వాలేదని బాహాటంగానే చెబుతున్నారు.
ఒకటో తేదీ జీతాలు పెరుగుతాయని ఆశగా వచ్చిన సచివాలయ సిబ్బంది తమ సాటి ప్రభుత్వ ఉద్యోగులే ఇలా తమ నుంచి లంచాలు తీసుకోవడంతో ఒక్క సారిగా హతాశులైపోతున్నారు. లంచం ఇవ్వకపోతే గతంలో అడ్వాన్సులు తీసుకున్నారని, లేదా మరేదైనా కారణం చూపి కొత్త పీఆర్ సి వేతనం అడ్డుకుంటారని భయంతో లంచం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.
సచివాలయం ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే జిల్లా ల నుంచి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. పది లక్షల మంది ఉద్యోగుల నుంచి ఇలా లంచాలు వసూలు చేస్తున్నారు. సెక్రటేరియేట్ ఉద్యోగులు ఇవ్వగానే లేంది మీరేంటి అంటూ జిల్లాల నుంచి వచ్చిన వారి వద్ద లంచం బాహాటంగానే గుంజేస్తున్నారు. ఇన్నేళ్లు వేచి ఉండి ఉప్పుడు పి ఆర్ సి వచ్చిందని సంతోషపడుతున్న వారికి లంచాల బెడద తీవ్ర నిరాశ కలిగిస్తున్నది.