పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విధంగా రేపు లక్నోలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని నవతరం పార్టీ నేత డా॥గోదా రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన మీడియా సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ధరలు వస్తే సామాన్యులకు ఊరట కలుగుతుందని, 30 శాతం మేర ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
ప్రస్తుతం 107 రూపాయలుగా ఉన్న లీటర్ పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే 70 నుంచి 80 రూపాయలకు చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయని కేంద్రంపై వివిధ రాష్ట్రాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని దీంతో జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ను తెచ్చే అంశంపై కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. 17వ తేదీన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగనున్నదని ఈ సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
దాదాపు 20 నెలల తర్వాత ఈనెల 17న జీఎస్టీ మండలి సమావేశం వీడియో ద్వారా కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో లక్నోలో జరగబోతోందని ఆయన తెలిపారు. కేంద్ర పన్నుతో సహా వ్యాట్ రూపంలో పెట్రోల్, డీజిల్పై ప్రస్తుతం రిటైల్ విక్రయ ధరలో 50 శాతం పన్నులే ఉంటున్నాయని ఒకవేళ వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ఠ పన్ను 28 శాతంతో సహా ఫిక్స్డ్ సర్ఛార్జి ఉండే అవకాశముందని ఆయన తెలిపారు.
దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉందని కేంద్రం ప్రస్తుతం లీటర్ పెట్రోల్పై 32 రూపాయల80 పైసలు, డీజిల్పై 31 రూపాయల 80 పైసల సుంకం విధిస్తోందని ఆయన తెలిపారు. ఈ పన్ను మొత్తం కేంద్ర ఖాతాలోకే వెళుతోందని జీఎస్టీ పరిధిలోకి వస్తే రాష్ట్రాలు, కేంద్రం మధ్య 50-50 నిష్పత్తిలో ఆదాయాలు పంచుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
అనంతరం ఎంఐ ఎం నాయకులు షేక్ కరిముల్లా మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోని పెట్రోలు,డీజిల్ ధరలను తీసుకెళ్ళి సామాన్యులకు పెట్రోలు,డీజిల్ ధరలను అందుబాటులోకి తెవాలని కోరారు.