కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. అధికార బీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు బీజేపీలో చేరారు. కూకట్ పల్లి నియోజకవర్గం నుండి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకులు వడ్డేవల్లి శరణ్, కూకట్ పల్లి రెడ్డి సంఘం అధ్యక్షులు, బాలాజీ నగర్ సాయిబాబా దేవస్థానం చైర్మన్ సాధు ప్రతాప్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు ఎద్దుల సునీల్ రెడ్డి ఈరోజు మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా బిజెపి అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు.
రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. కెసిఆర్ దుర్మార్గపు నియంతృత్వపు నిరంకుశ పాలన నుండి రాష్ట్ర విముక్తి చేయటం ధ్యేయంగా భావించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు సాధు ప్రతాప రెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలనకు దేశాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి ఆకర్షితులై రాబోయే ఎన్నికలలో ఈ బారాస పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీని గెలిపించే లక్ష్యంతో పనిచేస్తామని యువ నాయకులు శరణ్, సునీల్ రెడ్డి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం వారి వెంట వివిధ డివిజన్ల చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా ఇంఛార్జి మాధవరం కాంతారావు, బిజెపి నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొని పార్టీలో చేరిన వారిని కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.